న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపిఎల్ 2021 సీజన్లో ధోనీ బరిలో దిగితే క్యాష్ రిచ్ లీగ్లో అత్యధికంగా రూ.150 కోట్లు వేతనం తీసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఐపిఎల్లో మొత్తం 13 సీజన్లు ఆడిన ధోనీ.. అత్యధికంగా రూ.137 కోట్లు వేతనంగా తీసుకున్నాడు. 2008లో ఏడాదికి రూ.6 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.18 కోట్లకు ధోనీని చెన్నై తీసుకుంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వేతనం నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో ధోనీ జీతం రూ.8.28 కోట్లకు పెరిగింది. ఈ ఒప్పందం మూడేళ్లు కొనసాగింది. 2014, 2015లలో ధోని ఏడాదికి రూ.12.5 కోట్లు సంపాదించాడు. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున రెండేళ్లు ఆడిన ధోనీకి రూ.25 కోట్లు లభించాయి. 2018లో మరోసారి చెన్నై పగ్గాలు చేపట్టిన ధోనీ ఏడాదికి రూ.15 కోట్లు చొప్పున మూడేళ్లలో రూ.45 కోట్లు సంపాదించాడు. 2021 సీజన్లోనూ ధోనీకి మరో రూ.15 కోట్లు లభిస్తాయి. దీంతో ఐపిఎల్ మొత్తంలో రూ.150 కోట్లు వేతనంగా తీసుకున్న ఆటగాడిగా ధోని రికార్డు నెలకొల్పుతాడు.
ధోనీ తర్వాత రోహిత్..
అవార్డులు, రివార్డులు అన్నీ లెక్కేస్తే ధోనీ ఆదాయం రూ.200 కోట్లు దాటొచ్చని అంచనా. ఇక ఇప్పటి వరకు రూ.131 కోట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో, రూ.126 కోట్లతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు. వచ్చే సీజన్లో రోహిత్కు ముంబై ఇండియన్స్ రూ.15 కోట్లు ఇవ్వనుండటంతో రూ.146 కోట్లతో రోహిత్ రెండో స్థానంలో ఉంటాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కోహ్లీకి రూ.17 కోట్లు ఇస్తుంది. దీంతో రూ.143 కోట్లతో కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతాడు. 2021 ఐపిఎల్లో బరిలో దిగితే సురేశ్ రైనా, డివిలియర్స్లు రూ.100 కోట్ల మైలురాయిని అధిగమిస్తారు.